షాకింగ్: విడాకులు అడిగిన భార్య.. బతికుండగానే పూడ్చేసిన భర్త!

man-arrest-for-burried-his-wife-alive
- Advertisement -

మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. భార్య విడాకులు అడిగిందన్న కోపంతో ఓ వ్యక్తి ఆమెను బతికుండగానే పూడ్చిపెట్టేశాడు. ఈ విషయం ఐదేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆ భర్తను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

అసలేం జరిగిందంటే… మెక్సికోకు చెందిన ఈవిల్‌ రెనే ఎన్ అనే వ్యక్తికి భార్య శాండ్రా లజ్ డియాజ్ మోరెల్స్‌తో మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేని ఆమె విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది.

మెక్సికో చట్టాల ప్రకారం విడాకులు తీసుకున్న భార్యకు భర్త ఆస్తిలో సగం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తన భార్య విడాకులు తీసుకుంటే తన సగం ఆస్తిని వదులుకోవాల్సి వస్తుందని భావించిన ఈవిల్ ఎలాగైనా భార్య అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరికొందరితో కలిసి భార్యను మట్టుబెట్టే ప్లాన్ వేశాడు.

పథకం ప్రకారం.. కారులో వెళుతుండగా ఓ చోట రోడ్డుపై యాక్సిడెంట్ జరిగినట్టు డ్రామా ఆడి తన భార్య శాండ్రా కారు దిగేలా చేశాడు ఈవిల్. ఇక అదే అదనుగా ఆమె చేతులు, కాళ్లు కట్టేసి తన తమ్ముడికి చెందిన ఓ ఖాళీ స్థలం వద్దకు తరలించారు.

అక్కడ ఓ భారీ గొయ్యి తవ్వి పాపం బతికుండగానే ఆమెను పూడ్చిపెట్టేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పైన సిమెంట్‌ కూడా వేసేశారు. ఇదంతా 2014లో జరిగింది.

ఇటీవల ఈవిల్ తమ్ముడు ఆ స్థలాన్ని మరొక వ్యక్తికి అమ్మగా.. సదరు స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి అక్కడో భారీ భవనం నిర్మించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పునాదుల కోసం గోతులు తవ్వించగా ఓ చోటు అస్థిపంజరం కనిపించింది. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆ అస్థిపంజరానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా అది ఈవిల్ భార్య అని తేలింది. దీంతో పోలీసులు ఈవిల్‌తో పాటు అతడి తమ్ముడిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో పోలీసులు వారిపై హత్య కేసు నమోదు చేశారు.

అంతేకాదు, శాండ్రా హత్య విషయంలో వారికి సహకరించిన మిగతా ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వీళ్లకి 51 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో చేసిన పాపాన్ని తలుచుకుంటూ ప్రస్తుతం అందరూ జైలు జీవితం గడుపుతున్నారు.

- Advertisement -