హైదరాబాద్: ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఎన్టీఆర్ బయోపిక్కి సన్నాహాలు జరుగుతున్నప్పుడే ఏఎన్నార్ బయోపిక్కి సంబంధించిన ఊహాగానాలు మొదలయ్యాయి. అక్కినేని నాగేశ్వరరావు జీవిత కథా చిత్రంపై ఆయన తనయుడు హీరోనాగార్జునకి కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.
ఏఎన్నార్ జీవితం చాలా సాఫీగా సాగిపోయిందనీ, అందువలన ఆయన బయోపిక్ను తెరకెక్కిస్తే.. డ్రామా లేదంటూ ప్రేక్షకులు తిరస్కరించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని అప్పట్లో నాగార్జున వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏఎన్నార్ బయోపిక్ విషయంలో ఆయన తన మనసు మార్చుకున్నట్లు సమాచారం.
లాభనష్టాల సంగతి పక్కనబెడితే..
ఏఎన్నార్ బయోపిక్ను తెరకెక్కించాక.. లాభనష్టాల సంగతి పక్కనబెడితే.. అసలు ఏఎన్నార్ జీవిత విశేషాలను తర్వాతి తరాలవారికి అందిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి నాగార్జున వచ్చినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు, ఈ మధ్యనే ఈ విషయమై నాగార్జున కుటుంబ సభ్యులంతా కూర్చుని ఒక నిర్ణయానికి కూడా వచ్చేసినట్లుగా చెబుతున్నారు.
మరో విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ బయోపిక్లో ఏఎన్నార్ పాత్ర ధరించిన సుమంత్ లుక్, నటన అందరి ప్రశంసలు అందుకోవడంతో.. ఒకవేళ ఏఎన్నార్ బయోపిక్ అంటూ తీస్తే సుమంత్తోనే తీయవచ్చనే టాక్ వినిపిస్తోంది.