
కోల్కతా: కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర పెద్దలు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
బెంగాల్ లో హింసను సృష్టించి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గొంతుకను నొక్కేసేందుకు బీజేపీ ఓ పద్ధతి ప్రకారం హింసకు పాల్పడుతోందని, ఇదంతా వారి గేమ్ ప్లాన్లో భాగమేనన్నారు. అయితే, తన ప్రభుత్వాన్ని కూల్చాలన్న వారి ప్రయత్నాలు ఫలించబోవని మమత తేల్చి చెప్పారు.
దేశం మొత్తం మీద బీజేపీని తానొక్కదాన్నే వ్యతిరేకిస్తుండడంతో తట్టుకోలేని బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. అయితే రాష్ట్రంలోని హింస, అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
కాగా, బెంగాల్లో జరుగుతున్న హింసపై ఆ రాష్ట్ర గవర్నర్ త్రిపాఠి స్పందిస్తూ..రాష్ట్రంలో పరిస్థితి మరీ దిగజారితే రాష్ట్రపతి పాలన విధించక తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనల్లో ఇప్పటివరకు 12 మంది మరణించారని, అల్లర్లు మరింత పెరిగితే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.








