
కోల్కతా: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో కొంతమంది కార్యకర్తలకు కూడా మరణించారు.
అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా బెంగాల్ లో పరిస్థితులు మారలేదు. నిత్యం ఏదొకచోట టీఎంసీ శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం జరిగిన హింసలో నలుగురు మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక దీనిని కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక అందించారు. దీనిపై త్రిపాఠి మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి మరీ దిగజారితే రాష్ట్రపతి పాలన విధించక తప్పదని స్పష్టం చేశారు.
ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనల్లో ఇప్పటివరకు 12 మంది మరణించారని, అల్లర్లు మరింత పెరిగితే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అయితే రాష్ట్రపతి పాలనపై తాను ప్రధానికి గానీ, కేంద్ర హోంమంత్రికి గానీ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని త్రిపాఠి వెల్లడించారు.








