గుంటూరు: 74 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన బామ్మ కవలలకు జన్మనిచ్చింది. గుంటూరు అహల్యా ఆస్పతిలో గురువారం ఆమెకు సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. నలుగురు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం తల్లీ పిల్లలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే… మంగాయమ్మకు 1962లో తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన రైతు యర్రమట్టి రామరాజారావుతో వివాహమైంది. ఈ దంపతులు వివాహమైన నాటినుంచి సంతానం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గత ఏడాది మంగాయమ్మ ఇంటి పక్కనే ఉన్న ఓ 55 ఏళ్ల మహిళ ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా గర్భం దాల్చింది.
చదవండి: విచిత్రం: కాసేపట్లో అంత్యక్రియలు.. అంతలోనే చనిపోయిన యువకుడు లేచి కూర్చున్నాడు!
దీంతో మంగాయమ్మ కూడా ధైర్యం తెచ్చుకుని.. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు సిద్ధమైంది. 2018 నవంబర్లో రామరాజారావు దంపతులు గుంటూరు అహల్యా ఆసుపత్రిని సంప్రదించారు. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఐవీఎఫ్ పద్ధతిలో మంగాయమ్మ గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆసుపత్రిలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్యసేవలందించారు.
డాకర్ల నిరంతర పర్యవేక్షణలో…
మంగాయమ్మకు బీపీ, షుగర్ లేకపోవడంతో ఆమె గర్భంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బిడ్డలు ఆరోగ్యంగా ఎదిగారు. గుండె వైద్య నిపుణుడు పీవీ మనోహర్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణుడు శనక్కాయల ఉదయ్శంకర్ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
గురువారం ఆమెకు సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో.. 57 ఏళ్లుగా పిల్లల కోసం తపన పడిన ఆ దంపతుల కల నెరవేరినట్లయింది. దీంతో వారి కుటుంబంలో సంతోషం నెలకొంది. అంతేకాదు, మంగాయమ్మ ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందిన అతి పెద్ద వయసు ఉన్న మహిళగా ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పారు.
ఇప్పటివరకు రాజస్తాన్లో దల్జీందర్ అనే మహిళ పేరిట ఈ రికార్డు ఉంది. దల్జీందర్ 72 ఏళ్ల వయస్సులో మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా దల్జీందర్ రికార్డును అధిగమించి మంగాయమ్మ కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో దల్జీందర్ స్థాపించిన రికార్డును ఇప్పుడు మంగాయమ్మ బద్ధలు కొట్టినట్లయింది.