హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య నేపథ్యంలో నటి ఖుష్బూ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ఒక దశలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించారు.
ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక ఒత్తిడి, బాధలు ఉంటాయని.. నాకవి లేవని ఎవరైనా చెబితే అది అబద్ధమేనని ఖుష్బూ పేర్కొన్నారు.
‘‘ఒకానొక దశలో నా జీవితం ఆగినట్లు అనిపించింది.. భయం వేసింది. నేను కూడా చాలా మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నా. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా. కానీ, ఓ సందర్భంలో బాధ, మానసిక ఒత్తిడిళ్లపై పోరాడాలనే కసి కలిగింది. దాంతో అప్పటి నా నిర్ణయం మార్చుకున్నా..’’ అని చెప్పారామె.
తనలోని ధైర్యమే తనను ఆ అఘాయిత్యానికి పాల్పడకుండా అడ్డుకుందని తెలిపారు. ఆ సమయంలో తన స్నేహితులు తన పట్ల దేవదూతల్లా మారారని పేర్కొన్నారు.
‘‘నన్ను ఇబ్బంది పెడుతున్న సమస్యల కోసం విలువైన నా జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి? అనుకున్నాను. పరాజయాలకు నేను ఏనాడూ భయపడలేదు. నన్ను ఓడించి, నాశనం చేయాలనుకుంటున్న సమస్యలకంటే నేనే దృఢమైనదాన్ని అని నిరూపించాలని నిర్ణయించుకున్నా..’’ అని ఖుష్బూ వివరించారు.
తనలోని పోరాడే శక్తిని కూడదీసుకుని ధైర్యంగా ముందడుగు వేశానన్నారు. పరాజయాల్ని విజయాలుగా మార్చుకోవడం నేర్చుకుని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని ఖుష్బూ పేర్కొన్నారు.