
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న మోడీ వేవ్తో…ఎవరు ఊహించని విధంగా బీజేపీ తెలంగాణలో నాలుగు పార్లమెంట్ సీట్లని గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఈ మోడీ వేవ్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కవిత కూడా ఓటమి పాలయ్యారు.
ఇక 4 సీట్లు గెలుచుకుని తెలంగాణలో మంచి ఊపు మీదున్న బీజేపీ…పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా టీడీపీ, కాంగ్రెస్ నాయకులను తమవైపు తిప్పుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది.
అందులో భాగంగా మొదట తెలంగాణలో దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్న టీడీపీ నేతలనీ పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
తాజాగా తెలంగాణ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, చాడా సురేశ్ రెడ్డి కలిసి ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో వీరు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ప్రచారంపై స్పందించిన పెద్దిరెడ్డి… ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. రాంమాధవ్ను మర్యాదపూర్వకంగానే కలిశామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు అభినందనలు చెప్పేందుకే కలిశామని వివరణ ఇచ్చారు.








