ఖమ్మం: జిల్లాలో టీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ బుడాన్ బేగ్ ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టేశారు బుడాన్ బేగ్. టీడీపీలో చేరేందుకు ఆయన మొగ్గుచూపారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా ఉన్న బేగ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్నారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఈ నెల 28న ఖమ్మం వేదికగా జరిగే భారీ బహిరంగ సభలో ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు.
తుమ్మల బుజ్జగింపు, అయినా…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని బుడాన్ బేగ్ ఆశించారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు టిక్కెట్ కేటాయించలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టిక్కెట్ దక్కకపోవడంతోపాటు మరికొన్ని విషయాల్లోనూ పార్టీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బుడాన్ బేగ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బేగ్ను బుజ్జగించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగారు.