మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ను 17 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్లను సాధించినట్టేనని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి హిందూ ముస్లింల బీమారీ ఉందంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో గిరిజనుల జనాభా పెరిగిందన్నారు. రాష్ట్రం నుండి 17 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గనుక గెలిపిస్తే.. ఎస్టీ రిజర్వేషన్లు సాధించుకొన్నట్టేనని చెప్పారు. కేంద్రం మెడలు వంచి మరీ రిజర్వేషన్లను సాధిస్తామన్నారు.
‘‘తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తామంటాడా..?’’
ఎవరు గెలిస్తే ప్రజల తలరాత మారుతోందో ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతామని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ బలరామ్ నాయక్ మాట్లాడారని కేసీఆర్ గుర్తు చేశారు. మనమే ఆ బలరామ్ నాయక్ను పాకాలలో కలిపేద్దామన్నారు.
కేసీఆర్ సీఎం కాకుంటే మహబూబాబాద్ జిల్లా అయ్యేదా? అని ప్రశ్నించారు. గిరిజన తండాలను గ్రామ పంచాయితీలుగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. మళ్లీ లక్ష రూపాయాల రుణ మాఫీ చేస్తామన్నారు. నాలుగున్నర ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిన చరిత్ర తమ ప్రభుత్వానిదని కేసీఆర్ గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయంగా నిధులు ఇవ్వనని చెప్పినా కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మంచివాడని, ఆయనపై కొందరు గిట్టనివాళ్లు తప్పుడు ప్రచారం చేశారని కేసీఆర్ పెర్కొన్నారు.