హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి శనివారు హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని, దాదాపు 18 డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా వందల కోట్లను దేశం దాటించారని వార్తలు మొదలైన పలు ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.
చదవండి: ఏటా ఆస్తుల విలువ పెరగదా? ఇందులో వింతేముంది?: రేవంత్ రెడ్డి
రేవంత్ బంజారాహిల్స్ వున్న తన 4 అంతస్తుల భవనం నుండి అవినీతికి పాల్పడినట్లు, తాను 18 షెల్ కంపెనీలను పెట్టి భారీగా మనీ లాండరింగ్కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపనలపై మాట్లాడుతూ.. ‘‘బంజారాహిల్స్ లోని ఇంటిని 22 ఏళ్లుగా కంపెనీలకు లీజుకు ఇస్తున్నామని, ఇప్పటివరకూ చాలా కంపెనీలు ఆ బిల్డింగ్ను లీజుకు తీసుకున్నాయని’’ అని రేవంత్ సీరియస్గా స్పందించారు.
చాలా కంపెనీలు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అద్దెకున్న ఇంటి అడ్రస్ పైనే చేసుకుంటాయని, వాటన్నింటిని తన నెత్తికి రుద్దితే ఎలాగని రేవంత్ ప్రశ్నించారు. తాను 23 మంది డైరెక్టర్లను నియమించి బినామీ కంపెనీలను నడుపుతున్నానని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ రెచ్చగొట్టిన ఓ జంతువు తనపై తప్పుడు ఈ ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ప్రతీకార రాజకీయాలు చెయ్యడం ఎన్నటికీ మంచిది కాదని’’ రేవంత్ అన్నారు.