మిమిక్రీ లెజెండ్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

nerella-venumadhav
- Advertisement -

nerella-venumadhav

హైదరాబాద్: తెలంగాణ తల్లి మరో ముద్దుబిడ్డను కోల్పోయింది.  తన గొంతుతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిని అలరించిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్(85) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన, వరంగల్ లోని తన స్వగృహంలో తుది శ్వాసవిడిచారు. ఆయన మరణవార్త తెలియగానే ఆయన అభిమానులు పెద్దఎత్తున ఆయనింటికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. పలువురు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

1932, డిసెంబర్ 28న వరంగల్ జిల్లా మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు జన్మించిన వేణుమాధవ్, పదహారేళ్ల ప్రాయంలోనే ధ్వని అనుకరణ రంగంలోకి ప్రవేశించారు. అందులో నిష్ణాతులై దేశ విదేశాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళంలోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్రా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ పురస్కారాలను ఇచ్చాయి.  నేరెళ్ల పేరు మీద 2017 డిసెంబరు 24 న పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన ఇచ్చిన ఏకైక తెలుగు కళాకారుడాయన. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెన్నడీ నుంచి భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు, హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్ దాకా హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఇలా ఆయన అనుకరించని గొంతులేదంటే అతిశయోక్తి కాదు.

2001లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ రికార్డుల పుస్తకం సంయుక్తంగా నేరెళ్లను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించాయి. ఈ వేడుక ఆయన 83వ పుట్టిన రోజు సందర్భంగా హన్మకొండలో ఘనంగా జరిపారు.  డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ జన్మదినం డిసెంబర్ 28 న  ఆయన శిష్యులు ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా జరుపుతున్నారు. 1971లో పీవీ నరసింహరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ వేణుమాధవ్ కొంతకాలం ఎమ్మెల్సీగానూ పనిచేశారు.

ఆంధ్రా విద్యాభివర్దిని హైస్కూల్‌లో చదువుతుండగానే హరి రాధాకృష్ణ మూర్తి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాల్లో నటించి తన రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 12 సినిమాల్లోనూ నటించారు. నాటి సినీ ప్రముఖులు చిత్తూరు నాగయ్య, గుమ్మడి, అక్కినేని, జగ్గయ్య, ఘంటసాల, బీఎన్‌రెడ్డి, దాశరథిలతోపాటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రచయిత సి.నారాయణరెడ్డి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి లాంటి వారితోనూ వేణుమాధవ్‌ సన్నిహిత సంబంధాలు సాగించారు.

ఎంతోమంది గొంతుకలను తన స్వరంతో పలికించారు. వేల ప్రదర్శనలు ఇచ్చి అందరితోనూ శభాష్‌ అనిపించుకున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, అమితాబ్‌, రేలంగి, రమణారెడ్డి, సుభాష్‌ చంద్రబోస్‌, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి, గౌతు లచ్చన్న, ఎంజీఆర్‌, కరుణానిధి లాంటి ప్రముఖులను తన గొంతులో సాక్షాత్కరింపజేశారు. నేటి తరం మిమిక్రీ కళాకారుల్లో చాలా మంది ఈయనకు శిష్యులే.

 

- Advertisement -