టీఆర్ఎస్‌‌లో చేరిన బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి

kotha srinivas reddy
- Advertisement -

kotha srinivas reddy

కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రతి పార్టీ  తమ అసమ్మతి నేతల ఆగ్రహానికి గురవుతోంది. ఇదే అలజడి ప్రస్తుతం బీజేపీ పార్టీలో జరుగుతుంది.

ఇటీవలే బీజేపీ ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి పార్టీపై తిరుగుబాటు చేసి తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ మూడు పేజీలతో కూడిన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు పంపించిన విషయం తెలిసిందే.

తాజాగా బుధవారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ జాయిన్ అయ్యారు. కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌తో పాటు ఎంపిలు వినోద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కేటీఆర్‌ను కలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి..  కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… నూతన రాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ నాలుగేళ్ల పాలన, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు తనను ఎంతో ఆకర్షించాయని తెలిపారు. అయితే టీఆర్ఎస్‌లో చేరడానికి సమయం కోసం ఎదురుచూశానని…ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టే టీఆర్ఎస్‌లో చేరానని చెప్పారు.

కష్టపడి పని చేస్తున్న వారికి బీజేపీలో గుర్తింపు లేకుండా పోయిందని,  అందువల్లే రాజీనామా చేశానని, బీజేపీ పెద్దలు తనకు తీవ్ర అన్యాయం చేశారని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఇప్పుడుటీఆర్ఎస్‌లో చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

 

- Advertisement -