
హైదరాబాద్: మరో రెండో రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాలు లెక్కింపు గురువారం ఉదయం 7 గంటల నుంచి మొదలు కానుంది.
ఈ క్రమంలోనే ఫలితాలు లెక్కింపు జరిగే గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. దీంతో మందు బాబులుకి మద్యం కావాలంటే 24 గంటలు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ఆంక్షలను విధిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. కౌంటింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతుందని, కాబట్టి ఈ ప్రాంతాల్లో ఐదుగురు, అంతకన్నా ఎక్కువ మంది ఒకచోట గుమికూడేందుకు వీల్లేదని, విజయోత్సవ ర్యాలీలు జరపరాదని ఆదేశించారు.
గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకూ మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్టు తెలిపారు. నగర పరిధిలోని కల్లు దుకాణాలు, స్టార్ హోటళ్లలోని బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చరాదని, పరిమితికి లోబడి మాత్రమే డీజేలకు అనుమతి ఉంటుందని తెలిపారు.








