
నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్లోని కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం నుంచి 10 మంది రోగులు శనివారం రాత్రి పరార్ అయినట్లు తెలుస్తోంది.
ఒకవైపు జిల్లాలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా.. మరోవైపు రిమ్స్ నుంచి కరోనా రోగులు పరారు కావడం కలకలం రేపుతోంది.
ఈ ఘటనకు.. రిమ్స్ కోవిడ్ కేంద్రంలో సౌకర్యాల లేమితోపాటు, అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణ లోపం కారణాలుగా చెబుతున్నారు.
ఇటీవల రిమ్స్లో సౌకర్యాల లేమి గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. ఈ క్రమంలో భయపడిన పది మంది కరోనా పాజిటివ్ రోగులు సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నట్లు సమాచారం.
పరారైన కరోనా రోగుల్లో కైలాస్నగర్, చాందా, టీచర్స్ కాలనీ, నిజామాబాద్, కొత్త కుమ్మరివాడ, ద్వారక నగర్, ఇంద్రవెల్లి, ఖానాపూర్కు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.
రిమ్స్లో సరైన సౌకర్యాలు, మెరుగైన వైద్య సేవలు లభించకపోవడం వల్లే కరోనా రోగులు పరార్ అయినట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు తప్పించుకున్న రోగుల్లో ముగ్గురిని అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు రోగులను వైద్య సిబ్బంది, పోలీసులు తిరిగి రిమ్స్కు తరలించినట్లు తెలుస్తోంది. ఇంద్రవెల్లికి చెందిన ఒక పాజిటివ్ పేషెంట్కు హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు అనుమతించినట్లు సమాచారం.
అయితే రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మాత్రం కరోనా రోగుల పరారీ అవాస్తవం అని చెబుతున్నారు. వారంతా పండుగ కోసం అనుమతి తీసుకునే వెళ్లారని, అంతేకాక వారు తిరిగి రిమ్స్కు వచ్చేశారని కూడా ఆయన చెబుతున్నారు.








