హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను అప్పట్లో కుదిపేసిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి సోమవారం ఈ కేసుపై పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమీక్ష నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ఓటుకు నోటు కేసును కేసీఆర్ మళ్లీ తెరపైకి తీసుకువచ్చారని అన్నారు.
కాగా, కేసీఆర్ సర్కారు రైతులకు సంకెళ్లు వేసిందని, మరోవైపు ఆయన రైతు బంధువంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని వీహెచ్ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్ రైతుబంధు పథకం తెస్తున్నారని, దాని ప్రారంభోత్సవానికి రావద్దని కోరుతూ తాను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్, తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్లకు లేఖలు రాస్తానని చెప్పారు.