ఛత్తీస్గఢ్: దేశంలో ఎన్నికల సంగ్రామం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారం పైనే దృష్టి సారించాయి. ఎన్నికల సంగతి కాసేపు పక్కన పెడితే, ప్రచారం మాత్రం కొత్త పుంతలు తొక్కుతుంది. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లోని మొరేనా లో డోర్ బెల్ పాడైంది తలపులు తీసేందుకు దయచేసి మోడీ మోడీ అరవండి అంటూ ఓ ఆసక్తికర ప్రచారం సాగితే తాజాగా గేదె పై ఎన్నికల ప్రచారం చేసి మరో సంచలనం అవుతుందని భావించారు ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ యువత . అయితే అది కాస్తా రివర్స్ అయ్యింది.
అసలు విషయానికొస్తే.. ఛత్తీస్గఢ్లోని కవర్దాలో వినూత్న ఎన్నికల ప్రచారం అని భావించి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఓ పాడి గేదెపై మా మాట వినండి. ఈ సారికి కాంగ్రెస్ను ఎన్నుకోండి. కాంగ్రెస్కే ఓటేయండి అనే అర్థం వచ్చేలా హిందీలో రాశారు. తర్వాత తాడు విప్పేసి ఆ గేదెను వదిలేశారు.
ఈసీ సీరియస్… దిగొచ్చిన కాంగ్రెస్
అది వెళ్లిన ప్రతిచోటా జనం దాన్నే చిత్రంగా చూస్తున్నారు. కొందరు దానితో ఫొటోలను దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఎలాంటి ఖర్చూ లేకుండా అందరి దృష్టినీ ఆకర్షిస్తుండటంతో స్థానిక యువత సంతోషించారు. అంతే కాకుండా ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చుకు కూడా పరిమితి విధించటంతో ఫ్రీ గా ఎలాంటి ఖర్చు లేకుండా ప్రచారం జరుగుతుంది అని భావించారు.
కానీ ఇక్కడే వారికీ ఊహించని షాక్ తగిలింది. గేదెపై జరుగుతున్న ప్రచారానికి చాలా మంచి స్పందన వచ్చినప్పటికీ ఈసి మాత్రం ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని తెలిపింది. నోరు లేని పశువులను ప్రచారానికి వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ విషయంలో ఈ ప్రచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
ఇకపొతే గేదెపై జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజిచ్చినప్పటికీ అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రిందకు వస్తుందని భావించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వివాదంపై స్పందించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి శైలేష్ నితిన్ త్రివేది మాట్లాడుతూ ఈ తరహా ప్రచారానికి మా పార్టీ వ్యతిరేకం. గేదెను వినియోగించిన స్థానిక యువతను గుర్తిస్తాం. వారిపై ఫిర్యాదు చేస్తాం చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖంగు తిన్నారు.
పార్టీ కోసం స్పెషల్ గా ఉంటుందని ప్రచారం నిర్వహిస్తే అది తిరిగి తమకే ఇబ్బందికరంగా మారిందని వారు లోలోపల బాధ పడుతున్నారు. మొత్తానికి గేదెపై కాంగ్రెస్ కు ఓటు వెయ్యమని రాసి వింత ప్రచారం చేసిన యువత పై ఇప్పుడు మూగ జీవాలను ప్రచారానికి వినియోగించకూడదని చెప్పిన ఈసీ సీరియస్ అవ్వటం, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఫైర్ అవ్వటం అక్కడ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.