
ఢిల్లీ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు కోర్టు దిక్కరణ నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటూ ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారని ప్రశ్నించింది. చౌకీదార్ చోర్ హై అనే వ్యాఖ్యలు అత్యున్నత న్యాయస్థానానికి ఆపాదించేలా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఇటీవల తన సొంత నియోజకవర్గం అమేథీలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టే చెప్పింది అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పరువునష్టం దావా వేశారు. రాఫెల్ వివాదంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వక్రీకరించారంటూ ఆమె కోర్టుకు వెళ్లారు.
రాహుల్ వివరణ పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి
దీనిపై సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదని, కొందరు వక్రీకరించారని, అయినా సారీ చెబుతున్నానని తెలిపారు. అయితే, రాహుల్ గాంధీ వివరణకు సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు.
ఆయన చెప్పిన క్షమాపణలో పశ్చాత్తాపం కనపడలేదని అభిప్రాయపడింది. అసలు చౌకీదార్ అంటే ఎవరు, ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలతో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని ఆదేశిస్తూ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.








