జ్యోతిరాదిత్య సింధియాకు షాక్.. అపాయింట్‌మెంట్ ఇవ్వని సోనియా గాంధీ…

- Advertisement -

న్యూఢిల్లీ: తనను కలిసేందుకు వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్ ఇచ్చేందుకు నిరాకరించారు. మధ్యప్రదేశ్‌లో సంక్షోభంలో నేపథ్యంలో సోనియాను కలిసి అన్ని విషయాలు వివరించాలనుకున్న ఆయనకు సోనియా ఆ అవకాశం ఇవ్వలేదు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారు ఇబ్బందుల్లో పడడానికి సింధియానే కారణమన్న ఉద్దేశంతోనే సోనియా అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. నిజానికి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సింధియా ముఖ్యమంత్రి పదవిని ఆశించారు.

అప్పట్నించే అసంతృప్తిలో సింధియా…

అయితే, పార్టీ అధిష్ఠానం మాత్రం సీనియర్ నేత అన్న ఉద్దేశంతో కమల్‌నాథ్‌కు సర్కారు పగ్గాలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, తన మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలతో ఆయన అదృశ్యం కావడం సంచలనమైంది.

మరోవైపు సింధియా బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఆయన మద్దతుదారులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి అయిన బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రాబోతోందని కాంగ్రెస్ ముందుగానే ఊహించినట్టు ఇటీవల ఆ పార్టీ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. కమల్‌నాథ్ సర్కారును కూల్చివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

- Advertisement -