ముంబై: త్వరలో కొత్త రూ.100 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలామణీలోకి తీసుకురానుంది. ఈ నోటు లావెండర్ రంగులో ఉంటుంది. మహాత్మాగాంధీ సిరీస్లో భాగంగా తీసుకొస్తున్న ఈ నోటు వెనుక భాగంలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘రాణి కీ వావ్’ కనిపించనుంది. 142 మిల్లీ మీటర్ల పొడవు, 66 మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ నోటు ఉండనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
గుజరాత్లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి ‘రాణి కి వావ్’. ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాజితాలో చోటు దక్కింది. ఈ బావిని 11వ శతాబ్దంలో పఠాన్ రాజు సిద్ధార్థ జైసింగ్ నిర్మించారు. ఇది ఆనాటి భారతీయుల సాంకేతికతకు తార్కాణంగా నిలిచింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడం కోసం నిర్మించిన ఈ మెట్ల బావి ఓ అద్భుతం!
తొమ్మిది వందల ఏళ్లకుపైగా ఘన చరిత్ర ఉన్న ఈ బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది. దాదాపు ఏడు శతాబ్దాలపాటు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తుశాఖ వారు గుర్తించి.. అది పాడవకుండా తవ్వకాలు చేపట్టి.. మట్టికొట్టుకుపోయిన ఈ కట్టడాన్ని పునరుజ్జీవనంలోకి తెచ్చారు!
నిర్మాణం ఓ అద్బుతం…
ఈ బావి పొడవు. 209 అడుగులు, వెడల్పు 65 అడుగులు , లోతు 88 అడుగులు. చూడడానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. ‘రాణి కీ వావ్’ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు దశవతారాలు కనిపిస్తాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని, ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశ విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.