న్యూఢిల్లీ: బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులో బెంగళూరులోని మాల్యా ఆస్తులు అటాచ్ చేయాల్సిందిగా ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు ఆదేశించింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి చెందిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మత్తా, న్యాయవాది సంవేదనా వర్మ ద్వారా ఈ వ్యవహారంపై కోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి బెంగళూరు పోలీసులు మరికొంత సమయం అడిగారు. దీని తర్వాత చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ తాజా ఆదేశాలు జారీ చేశారు.
జులై 10కల్లా ఆస్తుల అటాచ్..
జులై 10 కల్లా ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా కోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అదే రోజు ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుంది. ఇంతకుముందు బెంగళూరు పోలీసులు తాము మాల్యాకి చెందిన 159 ఆస్తులను గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. కానీ, వాళ్లు వీటిలో ఏ ఆస్తిని అటాచ్ చేయలేకపోయారు.








