
న్యూఢిల్లీ: ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఐదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించని ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు.
అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించబోతోందని చెప్పిన మోడీ.. అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మోడీ ప్రతీ నెల రేడియో ద్వారా వినిపించే ‘మన్ కీ బాత్’ చివరి ఎపిసోడ్ను టీవీలో చూసినట్టు ఉందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఐదేళ్ల తర్వాత కూడా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
బీజేపీకి ఇదే చివరి విలేకరుల సమావేశమని.. లోక్తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. విలేకరుల ముందుకు వచ్చిన మోడీ హావభావాలు చూస్తుంటే ఆయన తన ఓటమిని అంగీకరించినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. బీజేపీకి కూడా ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయని శరద్ యాదవ్ అన్నారు.
విపక్ష నేతల వ్యంగ్యాస్త్రాలు…
జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొంతమంది బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పేందుకే మోడీ ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.
ఒకరిని అడిగే ప్రశ్నలకు మరొకరు జవాబు చెప్పే మీడియా సమావేశాన్ని తాను ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ అన్నారు.
విలేకరుల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం ప్రధాని మోడీకి లేదని దీని ద్వారా మరోమారు స్పష్టమైందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ వ్యాఖ్యానించారు.








