అమరావతి: జగన్ ప్రభుత్వం అచ్చెన్నాయుడి ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రయత్నాలు చేస్తోందంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
అరెస్టుకు ముందురోజే అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిందని, ఈ విషయం చెప్పినా వినకుండా ఆయన్ని అమానుషంగా వాహనంలో రోడ్లపై వందల కిలోమీటర్లు తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: అచ్చెన్నాయుడి ఇష్యూ: కస్టడీకి కోర్టు అనుమతి, అర్థరాత్రి హైడ్రామా! అసలేం జరిగిందంటే…
ఫలితంగా అచ్చెన్నాయుడి పరిస్థితి విషమంగా మారిందని, ఆయనకు రెండోసారి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
అచ్చెన్నాయుడిని ఆసుపత్రిలో బెడ్పై ఉండగానే ప్రశ్నించాలని, నిలబడాలని, కూర్చోవాలని కూడా కోరకూడదని ఏసీబీ కోర్టు చెబితే.. వీళ్లు చేస్తున్నదేంటి? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
‘‘పది రోజులపాటు బెడ్ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతుంటే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, అచ్చెన్నాయుడిని అర్థరాత్రే డిశ్చార్జ్ చేయాలని చూడడం ఏమిటి? ఇదేనా విచారణ పద్దతి?’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
అసలు అర్థరాత్రి పూట ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని తమ కస్టడీలోకి తీసుకోవాలని చూడడం ఏమిటి? ఈ అర్థరాత్రి కుట్రలేంటి? అని ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోందని, జీజీహెచ్ వర్గాలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఇది విచారణ చేస్తున్నట్లు లేదు.. హత్యాయత్నం చేస్తున్నట్లు ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘‘ ఈ ఉత్సాహం ఆ కేసుల్లో చూపించరేం..?’’
అచ్చెన్నాయుడి కేసులో చూపిస్తున్న అత్యుత్సాహం.. వైసీపీ భూదందాలు, ఇసుక మాఫియా, 108 అంబులెన్స్ల స్కామ్ మీద ఎందుకు లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
కొంతమంది పోలీసు అధికారుల అత్యుత్సాహం వల్లనే పోలీసు బాస్ కోర్టులో హాజరుకావలసి వస్తోందని నిన్ననే కోర్టు ఆక్షేపించిన సంగతి మరిచిపోయారా? అని నిలదీశారు.
అచ్చెన్నాయుడి విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు చంద్రబాబు. తాము కూడా న్యాయపరంగా పోరాడతామని, జగన్ ప్రభుత్వం కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు.