
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎన్నికల సంఘం ఊహించని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య హింసాత్మక ఘటనలు పెరిగిపోతుండడంతో ఎన్నికల సంఘం…రేపటితో బెంగాల్ లో ప్రచారాన్ని ఆపేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు మొదటిసారిగా 324 అధికరణ చట్టాన్ని ప్రయోగించింది. ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంటే ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. అయితే చివరి దశ పోలింగ్ ఈ నెల 19న ఆదివారం జరగనుంది.
దీంతో ఎన్నికల ప్రచారం మే 17 సాయంత్రం వరకు ఉంటుంది. కానీ కోల్ కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికల సంఘం ఒకరోజు ముందుగానే ప్రచారానికి బ్రేకులు వేసింది.
చదవండి కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలు తమిళనాడులో పనిచేయలేదు: విజయశాంతి
మొన్న అమిత్ షా ర్యాలీలో దాడులు, బీజేపీ ప్రతినిధుల నిర్బంధం, అరెస్టుల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తృణమూల్, బీజేపీల మధ్య గొడవలు తీవ్రరూపు దాల్చిన నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. సీఐడీ ఏడీజీ రాజీవ్ కుమార్ ను కేంద్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భట్టాచార్యపైనా వేటు పడింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని సీఈవోకు లేఖ రాయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.





