హైదరాబాద్: నగరంలోని గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నమ్మి తన వెంట వచ్చిన ఓ మైనర్ బాలిక(16)పై గంజాయి మత్తులో అమానుషంగా ప్రవర్తించాడు ఓ మైనర్ బాలుడు. బాలికను వివస్త్రను చేసి బ్లేడుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.
గంజాయి అలవాటు చేసి దారుణం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసమ్మగూడకు చెందిన మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లు కొంతకాలంగా గంజాయి అలవాటు చేశారు. ఈ క్రమంలో బాలికను లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్ మిల్స్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం అందరూ గంజాయి సేవించారు.
ఆ తర్వాత అందులోని ఓ మైనర్ ఆమెను వివస్త్రను చేసి ఒంటిపై బ్లేడుతో దాడి చేశాడు. అంతేగాక, ఈ దారుణాన్ని సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఆ బాలిక ఎంత బతిమాలినా వదల్లేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ బాలికను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు.
నిందితుడైన బాలుడితో పాటు అతడి స్నేహితులకు దేహశుద్ధి చేసిన స్థానికులు.. గాంధీనగర్ పోలీసులుకు అప్పగించారు. బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.