న్యూఢిల్లీ: పెట్రోలు కూడా ఇతర వస్తువుల్లానే డోర్ డెలివరీ కానుంది. ఇప్పటి వరకు దేశంలోని కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా డీజిల్ను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోలును కూడా డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి సంస్థలు నిర్ణయించాయి.
ఇప్పటి వరకు ఒక్క డీజిల్కు మాత్రమే డోర్ డెలివరీకి అనుమతులున్నాయి. అయితే, త్వరలోనే పెట్రోలు కూడా పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) అనుమతులు వస్తాయని హెచ్పీసీఎల్ చైర్మన్ ఎం.కె.సురానా ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం 35 నగరాల్లో డీజిల్ డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉంది.
భారీ పరిమాణంలో ఇంధానాన్ని కొనుగోలు చేసే వారిని ఉద్దేశించి ఈ సేవలను ప్రారంభించారు. ముంబై లాంటి నగరాల్లో నెలకు 150 కిలో లీటర్ల డీజిల్ను డోర్ డెలిరీ చేస్తున్నారు. అయితే, 2 వేల లీటర్లకు మించి పెట్రోలు డోర్ డెలివరీ చేయాలంటే పెసో అనుమతి తప్పనిసరి. కాబట్టి దాని అనుమతుల కోసం సంస్థలు ఎదురుచూస్తున్నాయి. అనుమతులు రాగానే డోల్ డెలివరీని ప్రారంభించనున్నాయి. ఇందుకోసం వాహనాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి.