హైదరాబాద్: ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా హిట్ తరువాత పాయల్ రాజ్ పుత్ వెనుదిరిగి చూడడం లేదు. ఆ సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ రావడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. దీంతో నచ్చిన పాత్రలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ పాయల్ తన కెరీర్లో దూసుకుపోతోంది. తాజాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్లో ఆమె అవకాశాన్ని దక్కించుకుంది.
వంశీకృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రూపొందుతోంది. 1980-90లలో స్టూవర్ట్ పురం గజదొంగగా ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడు. అతడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది.
వేశ్య పాత్రలో కాదు…
ఈ సినిమాలో వేశ్య పాత్రలో పాయల్ కనిపించనున్నట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆమెది వేశ్య పాత్ర కాదని, పాయల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోందని తాజాగా బయటికొచ్చింది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అక్క పాత్రలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కనిపించనుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో వాస్తవం ఏమిటో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.