
హైదరాబాద్: ‘‘ఇక మీ టైం అయిపోయింది. మీ పాపాలు బయటకు వస్తున్నాయి. నా మంచితనం ఏమిటో ఇప్పుడు బయటకు వస్తుంది. ఇపుడు చూడండి జనం ఏం మాట్లాడుకుంటారో. అందరూ నా గురించే మాట్లాడుకుంటారు. పాపం ఆవిడ మంచిది, అమాయకురాలు, మోసపోయిందని జాలి పడుతారు. వాస్తవం అనేది 23 ఏళ్ల తర్వాత బయటకు వస్తోంది..’’.
ఇవీ దివంగత ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి తాజా వ్యాఖ్యలు. ఇప్పటి వరకు రామారావు కుటుంబం తనను ఏకాకిని చేసి దుష్ప్రచారం చేసిందని, మరికొన్ని రోజుల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపంలో వాస్తవాలు బయటకు రాబోతున్నాయని, దానికి మొదట ఆర్జీవీ గారికి థాంక్స్ చెప్పాలి అని ఆమె తెలిపారు.
23 ఏళ్ల తర్వాత నిజం బయటికి…
తన భర్త ఎన్టీఆర్ విషయంలో ఏక పక్షంగా తనపై నిందలు వేశారని లక్ష్మి పార్వతి తెలిపారు. ‘‘ఆమె వైపు మాట్లాడే వారు ఎవరూ లేరు, కులాన్ని మా వైపు తిప్పుకున్నాం, అధికారం మా చేతుల్లోనే ఉంది, మీడియాను కూడా మేము కొనేసి పెట్టుకున్నాం. న్యాయ వ్యవస్థ అంతా కూడా మేం ఏం చెబితే అది చేస్తుంది. అందువల్ల ఒక స్త్రీ మీద మేం నిందలు వేస్తే జనం నమ్ముతారు అనుకుని వారు ఇదంతా చేశారు…’’ అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ‘‘ఇదంతా మీరు నా మీద చేస్తున్న కుట్ర అనుకున్నారు. కానీ ఇది మీ తండ్రి మీద మీరు చేసిన కుట్ర. స్వయానా మీ మామ మీదే మీరు చేసుకున్న కుట్ర. ఒక కుటుంబ వ్యవస్థకే విఘాతం కలిగించారు మీరు. మీ నీచమైన స్టోరీ చరిత్రగా మిగిలిపోతుంది..’’ అంటూ లక్ష్మీ పార్వతి మండి పడ్డారు.
‘‘ఒక స్త్రీ ఎంత ప్రేమించగలదో, ప్రేమించిన తన భర్త కోసం ఎంత వరకైనా నిలబడగలదు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా తన దారి తప్పకుండా భర్త దారిలో నడుస్తూ చివరి వరకు సాధించడానికి ఎలా నిలబడిందో రానున్న చరిత్ర నా గురించి రాయబోతోంది.. మీ గురించి కాదు..’’ అని ఆమె అన్నారు.
చదవండి: సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్! ‘మహానాయకుడు’పై రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్…








