
హైదరాబాద్: ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపించనున్నాడు.
స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కథానాయికలుగా అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నట్టు రాజమౌళి ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో తెలిపాడు.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ చిత్రంలో చేయడం లేదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడిక ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు? అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
గుజరాత్లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. రామ్ చరణ్కు గాయం కావడంతో 3 వారాల పాటు వాయిదా పడింది. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Due to unavoidable circumstances, @DaisyEdgarJones is no longer a part of our film. We hope she has a brilliant future. #RRR
— RRR Movie (@RRRMovie) April 5, 2019








