చెన్నై: కరోనా బారిన పడి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకుని తిరిగి రావాలంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆకాంక్షించారు.
బాలసుబ్రమణ్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇళయరాజా ఓ వీడియోను విడుదల చేశారు.
చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమం.. ఐసీయూకి తరలింపు
‘‘బాలూ.. త్వరగా కోలుకుని రా.. నీ కోసం ఎదురు చూస్తుంటాను.. మనిద్దరి జీవితం కేవలం సినిమాలతో మొదలైందీ కాదు.. వాటితో ముగిసీపోదు..’’ అని ఇళయరాజా ఆ వీడియోలో పేర్కొన్నారు.
‘‘సినిమాల కంటే ముందు మనం సంగీత వేదికలపై చేసిన కచేరి కార్యక్రమాలు.. ఆ సంగీతం మనకు జీవితమూ, జీవితాధారం అయ్యాయి.. ఆ వేదికల మీద మన స్నేహం సంగీతం, స్వరం లాంటిది..’’ అంటూ గుర్తు చేసుకున్నారు.
అంతేకాదు, స్వరం లేని సంగీతం ఎలా ఉండలేదో.. అలా నీ స్నేహం, నా స్నేహం, మన స్నేహం ఎన్నడూ దూరం కాదు అని ఇళయరాజా వ్యాఖ్యానించారు.
‘‘మనిద్దరి నడుమ గొడవ వచ్చినా.. రాకున్నా.. స్నేహం స్నేహమేనని నాకూ తెలుసు, నీకూ తెలుసు.. కాబట్టి నువ్వు కోలుకుని తిరిగిరా.. నువ్వొస్తావని నా అంతరాత్మ చెబుతోంది.. నీ కోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా..’’ అంటూ ఇళయరాజా ఆ వీడియోలో ఆకాంక్షించారు.