ఏ పాత్రనైనా ఆడుతూ పాడుతూ చాలా అలవోకగా చేసేస్తుంది అమ్మాయి..’ అనే కామెంట్ దర్శకులు దగ్గర్నుంచి చాలా త్వరగా కొట్టేసిన హీరోయిన్ అనుపమ. శతమానం భవతి తర్వాత, ఉన్నది ఒకటే జిందగీ, అఆ, తేజ్ ఐ లవ్యూ, ప్రేమమ్, తాజాగా విడుదలైన తేజ్ ఐ లవ్యూ లాంటి చిత్రలలో తన నటన అందరినీ అబ్బురపరచింది.
ఇటీవల ఆ చిత్రం విశేషాల గురించి ముచ్చటిస్తూ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలిపింది అనుపమ. ‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్గా ముందు అనుపమ పరమేశ్వరన్నే అనుకున్నారట. కానీ, ఆఖరి నిమిషంలో అనుపమ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె స్థానంలో సమంతను తీసుకున్నారట.
రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్గా సుకుమార్ ‘రంగస్థలం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు లభించింది. ‘రంగస్థలం’ సినిమాలో రామలక్ష్మి పాత్ర కోసం మొదట తననే సంప్రదించారని, కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా చేయలేకపోయానని అనుపమ బాధపడింది.
‘రంగస్థలం’ చూశాక సినిమాలో రామలక్ష్మి పాత్రకు సమంత మాత్రమే న్యాయం చేయగలరని, తను చాలా అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చింది. చిత్ర దర్శకుడు సుకుమార్తో కూడా రామలక్ష్మి పాత్రకు సమంత సరిగ్గా సరిపోతుందని చెప్పినట్టు కూడా తెలిపింది. అలాగే ఇటీవల అందరినోటా శభాష్ అనిపించుకున్న చిత్రం ‘మహానటి’లో కీర్తి సురేష్ పాత్ర చూసి తాను ఎంతగానో స్పూర్తి పొందానంటూ అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది .