డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని పౌరి గార్వాల్ జిల్లా నానిదానంద ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికుల బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 45 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరికొంతమంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించినట్లు సమాచారం.
రామ్నగర్ నుంచి భొయాన్ వెళ్తుండగా బస్సు అదుపుతప్పి 60 అడుగుల లోయలో పడిందని పోలీస్ కమిషనర్ దిలీప్ జవాల్కర్ తెలిపారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారని, అయితే వారిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం ప్రమాద స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.