ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘.ఎం.ఎస్. ధోనీ’ ఫేం హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ (34) ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ‘కోయ్ పో చి’తో కెరీర్ను ఆరంభించిన సుశాంత్ ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టివ్ బొమ్కేష్ బక్షి’, ‘ఎం.ఎస్.ధోని: ద అన్టోల్డ్ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్కమ్ న్యూయార్క్’, ‘కేదార్నాథ్’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్’, ‘డ్రైవ్’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్న సుశాంత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’. బాలీవుడ్లో లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పలువురు టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
మరోవైపు సుశాంత్ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ వార్త తమకు దిగ్భ్రాంతికి గురి చేసిందని, సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ట్వీట్ చేశారు.
సుశాంత్ మేనేజర్ కూడా..
ఆరు రోజుల క్రితం (9వ తేదీన) సుశాంత్ సింగ్ మేనేజర్ దిశ సలియా ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైలో తన భవనంలోని 14వ అంతస్తు పైనుంచి దూకింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే బొరివలిలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.