

న్యూఢిల్లీ: భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజ్పథ్ వేదికగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జెండా ఆవిష్కరణ సందర్బంగా ఇండియన్ ఆర్మీ 21 గన్ సెల్యూట్ చేసింది. కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీకి ప్రకటించిన అశోకచక్ర అవార్డును ఆయన సతీమణికి రాష్ట్రపతి అందజేశారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్ త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిద దళాల అధిపతులు నివాళులర్పించి రాజ్పథ్కు చేరుకున్నారు.
ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస
వైమానిక దళం జరిపిన ఆకాశ విన్యాసాలు కనువిందు చేశాయి. త్రిశూలం ఆకారంలో సుఖోయ్ యుద్ధవిమానాలు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రిపబ్లిక్ వేడుకల అతిథిగా వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస ప్రధాని నరేంద్ర మోడీ పక్కనే ఆసీనులై కవాతును, శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి గవర్నర్ నర్సింహన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జెండా ఆవిష్కరించారు. వివిధ పార్టీల నేతలు జెండా ఎగురవేశారు.
రాష్ట్రపతి భవన్తో గూగుల్ ప్రత్యేక డూడుల్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా హోం పేజీలో ప్రత్యేక డూడుల్ను ఉంచింది. 70వ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఈ డూడుల్ను తయారుచేసింది. అలాగే డూడుల్ బ్యాక్గ్రౌండ్లో రాష్ట్రపతి భవన్, చెట్లతో ఉన్న చిత్రాన్ని ఉంచింది. యునెస్కో గుర్తింపు పొందిన ఢిల్లీలోని కుతుబ్ మినార్ చిత్రం కూడా డూడుల్లో ఉంది. చేతి కళలు, భారత వారసత్వ సంపదను కూడా ప్రతిబింబించేలా అద్భుతంగా ఈసారి డూడుల్ను రూపొందించారు.








