హైదరాబాద్: ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నటీమణులు మరణించిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఓ సీరియల్లో నటిస్తున్నారు భార్గవి(20), అనూషా రెడ్డి(21).
తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వీరిద్దరు. అయితే షూటింగ్ కోసం వీరు సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లారు. అనంతగిరి గుట్టలపై షూటింగ్ అనంతరం కారులో హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు.
తిరుగు ప్రయాణంలో మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ బస్టాప్ వద్ద వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్గవి (20), అనూషా రెడ్డి (21) అక్కడికక్కడే మృతి చెందారు.
కారు డ్రైవర్ చక్రితో పాటు మరో వ్యక్తి వినయ్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. భార్గవి, అనూషా రెడ్డిల మరణంతో టీవీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.