
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు నటుడు శివాజీని అరెస్టు చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోనికి తీసుకుని.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అమెరికా పారిపోయేందుకు శివాజీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
చదవండి: జగన్ సంచలన నిర్ణయం.. అర్బన్ హౌసింగ్ స్కీమ్లోనూ ‘రివర్స్ టెండరింగ్’!?
దీంతో శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు అతడి పాస్పోర్టును సీజ్ చేశారు. దాదాపు 3 గంటల పాటు అలంద మీడియా, టీవీ9 వాటాల కొనుగోలు తదితర అంశాలపై శివాజీని విచారించిన పోలీసులు.. తరువాత 41 సీఆర్పీసీ కింద శివాజీకి నోటీసు ఇచ్చి.. ఈ నెల 11న తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ చెప్పి ఇంటికి పంపించివేశారు.
టీవీ9 వివాదంలో నిందితుడిగా…
టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా డైరక్టర్లలో ఒకరైన కౌశిక్ రావు ఆ ఛానల్ మాజీ సీఈవో రవిప్రకాష్, నటుడు శివాజీలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలంద మీడియాను ఇబ్బంది పెట్టడానికి టీవీ9 షేర్లను తన పేరు మీదికి బదలాయించుకుని ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారనేది శివాజీపై ఉన్న ప్రధాన ఆరోపణ.
ఈ నేపథ్యంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి టీవీ9 ఛానల్కు చెందిన షేర్లను ఆ సంస్థ సీఈవో రవిప్రకాశ్ నుంచి నటుడు శివాజీ కొనుగోలు చేశారంటూ అలంద మీడియా డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదానికి సంబంధించి రెండు నెలల క్రితమే రవిప్రకాష్, శివాజీలపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కొంతకాలం తరువాత రవిప్రకాష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాగా, శివాజీ మాత్రం అప్పటి నుంచి విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు.








