గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకులు తగిలేలా కనిపిస్తోంది. కేవలం 23 స్థానాలకి పరిమితమై ప్రతిపక్ష హోదాని దక్కించుకున్న టీడీపీకి…ఫలితాలు వెలువడిన తర్వాత కొందరు నేతలు పార్టీనీ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యారు.
అలాగే కొందరు నేతలు నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీని వీడతారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాటి చిలకలూరిపేట నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి విడదల రజనీ మీద ఓడిపోయారు. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన…వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది.
అయితే పార్టీ మారుతున్నారనే వార్తలపై ప్రత్తిపాటి స్పందించారు. ఈ రోజు గుంటూరులో మాట్లాడిన ఆయన, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని, నిరాధారమని స్పష్టం చేశారు.
తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం ఎదురైనా తనను సంప్రదించాలని సూచించారు.