
అమరావతి: గత కొన్ని రోజుల వరకు చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్, ఎట్టకేలకు టీడీపీ పార్టీని గద్దె దించి సీఎం సీటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. జగన్ ఆంధ్రరాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మే 30వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి రావలిసిందిగా కోరుతూ చంద్రబాబుకు జగన్ ఫోన్ చేశారు. నా ప్రమాణస్వీకారం 2019, మే 30వ తేదీ మధ్యాహ్నం 12:23 గంటలకు విజయవాడలో జరుగుతుంది. మీరు ఈ వేడుకకు హాజరుకావాలంటూ చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు కాబోయే సీఎం జగన్. విజయవాడలో ఉన్న జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్లు, కొత్త టీంపై కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే పీఎం మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లను కూడా స్వయంగా కలిసి ఆహ్వానించారు. అయితే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మాత్రం ఫోన్ ద్వారా ఆహ్వానించారు. స్వయంగా మాట్లాడిన జగన్ గట్టిగా రావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి రావాలని కోరారు.
తన తండ్రి దివంగత వైఎస్ కు మీరు సమకాలీకులని గుర్తు చేసిన జగన్, ప్రమాణ స్వీకారానికి వస్తే తాను ఆనందిస్తానని చెప్పినట్టు సమాచారం. దీనిపై చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది జగన్ స్వయంగా ఫోన్ చేసి చంద్రబాబును ఆహ్వానించటం ఆసక్తి కలిగిస్తోంది.








