
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి సినీనటుల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, దివంగత దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం దాసరి అరుణ్ మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్సీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్లు అరున్ తెలిపారు. జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే ప్రచారం చేస్తానని అన్నారు. ‘మా నాన్న దాసరి నారాయణరావు ఉండుంటే వైఎస్సార్సీపీ నుండి పోటీ చేసేవారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే ప్రచారానికి వెళతాను’ అని ఆయన తెలిపారు.
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కూడా గురువారం వైఎస్ఆర్సీపీలో చేరారు. కాగా ఇప్పటికే ప్రముఖ హాస్యనటుడు అలీతోపాటు పలువురు సినీనటులు వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే.
జగన్ సీఎం అవడం ఖాయం
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఖావడం ఖాయమని ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన ప్రముఖ సినీ నటుడు అలీ ధీమా వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. గురువారం నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ కల్యాణ మండపంలో జరిగిన కావలి నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో పేదలను పార్టీలకు అతీతంగా వైఎస్సార్ ఆదుకున్నారని చెప్పారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే తప్పరని తెలిపారు. రాష్ట్రానికి జగన్ రావాలి-జగన్ కావాలి అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్ అవసరం ఎంతో ఉందన్నారు. భగవంతుడు ఉన్నాడని.. మంచి రోజులు వస్తాయని అన్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ను గెలిపించి సీఎంను చేద్దామని కార్యకర్తలకు అలీ పిలుపునిచ్చారు.








