గుయానా:: మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత మహిళా జట్టుకు మరో విజయం సొంతమైంది. హ్యాట్రిక్ విజయంతో అదరగొట్టిన భారత మహిళా జట్టు.. ఐర్లాండ్జట్టును ఓడించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో భారత స్పిన్నర్ల ధాటికి ఐర్లాండ్ 8 వికెట్లకు 93 పరుగులే చేయగలిగింది. భారత్కు ఇది హ్యాట్రిక్ విజయం కాగా, ఐర్లాండ్కు హ్యాట్రిక్ ఓటమి.
మంధాన, రోడ్రిగ్స్ తో కలిసి మిథాలీ పరుగుల వేట…
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టును మిథాలీరాజ్ 56 బంతుల్లో 51 పరుగులు (4x 4, 1×6)తో ముదుండి నడిపించింది. మిథాలీతో పాటు స్మృతి మంధాన 29 బంతుల్లో 33 పరుగులు (4x 4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లింది. అయితే వీళ్లిద్దరూ క్రీజులో ఉన్నా జట్టు స్కోరు 4 ఓవర్లకు 16 పరుగులే. ఈ స్థితిలో రిచర్డ్సన్ వేసిన ఐదో ఓవర్లో సిక్స్ బాదిన మిథాలీ ఆ తర్వాత ఓవర్లో మరో 2 బౌండరీలు సాధించింది.
ఈ క్రమంలోనే రాక్ బౌలింగ్లో క్రీజు వదిలొచ్చి లాంగ్ ఆన్ మీదుగా మంధాన ముచ్చటైన సిక్స్ కొట్టింది. ఈ భాగస్వామ్యం బలపడుతున్న స్థితిలో గారెత్ వేసిన బంతిని అర్ధం చేసుకోవడంలో విఫలమైన మందాన బౌల్డ్ అయింది. మిథాలీ-మందాన జోడీ తొలి వికెట్కు 67 పరుగులు జోడించింది.
ఆ తరువాత జెమిమా రోడ్రిగ్స్ 11 బంతుల్లో 18 పరుగులు (3x 4)తో కలిసి మిథాలీరాజ్ స్కోరును పెంచింది. అయితే 14 ఓవర్లకు భారత్ స్కోరు 103 పరుగులు మాత్రమే. బ్యాట్ ఝుళిపించాల్సిన స్థితిలో జెమిమా ఔట్ కాగా.. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ సిక్స్ బాది మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపించినా అనూహ్యంగా పెవిలియన్ ముఖం పట్టింది. హర్మాన్ ప్రీత్ 3 బంతుల్లో కేవలం 7 పరుగులు(1×6) మాత్రమే చేసింది.
వేద కృష్ణమూర్తి కూడా వారి వరుసలోనే 9 బంతుల్లో 9 పరుగులు (1x 4) సాధించి పెవిలియన్ ముఖం పట్టింది. రీలీ బౌలింగ్లో సింగిల్ తీసి టీ20ల్లో 17వ హాఫ్ సెంచరీ సాధించిన మిథాలీ.. ఆ తర్వాత ఓవర్లోనే వికెట్కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుటైంది. చివర్లో దీప్తి శర్మ 7 బంతుల్లో 11 పరుగులతో (1x 4 నాటౌట్) నిలబడి భారత్ స్కోరును 140 పరుగులు దాటించింది.
కట్టుదిట్టంగా బౌలింగ్…
ఆ తరువాత బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ మహిళా జట్టు.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పొయి కేవలం 43 పరుగులే చేయగలిగింది. జాయ్స్ 38 బంతుల్లో 33 పరుగులు (4x 4) తో కాస్త దూకుడుగా ఆడటానికి ప్రయత్నించినా.. మరోవైపు నుంచి తగిన సహకారం లేకపోవడంతో ఐర్లాండ్ రన్రేట్ భారీగా పెరిగిపోయింది.
ధాటిగా ఆడే క్రమంలో ఐరిష్ అమ్మాయిలు పెవిలియన్కు వరుస కట్టారు. రాధ యాదవ్ (3/25) వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో 3 వికెట్లు (ఒక రనౌట్) పడడంతో ఐర్లాండ్ ఇక కోలుకోలేకపోయింది. రాధతో పాటు దీప్తిశర్మ (2/15), పూనమ్ (1/14), హర్మన్ప్రీత్ (1/10) టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో భారత్.. ఐర్లాండ్పై సునాయాసంగా విజయం సాధించి మహిళల టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.