దుబాయ్: ఆసియా కప్లో భారత్కి తిరుగులేదని టీం ఇండియా మరోసారి నిరూపించుకుంది. దుబాయ్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి ఆసియా కప్ని సొంతం చూసుకుంది. 2016 ఆసియా కప్ ఫైనల్లోనూ టీం ఇండియా బంగ్లాదేశ్పై గెలిచి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ఆసియా కప్ చరిత్రలో భారత్ విజేతగా నిలవడం ఇది ఏడోసారి.
ఓపెనర్ లిటన్ దాస్ (117 బంతుల్లో 121) సెంచరీ చేసినా… తరువాత వచ్చిన బ్యాట్స్మెన్ నిరాశపరచడంతో బంగ్లాదేశ్ జట్టు 48.3 ఓవర్లలో 222 పరుగులకి ఆలౌటైంది. అనంతరం విజయ లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (15), అంబటి రాయుడు (2) తక్కువ పరుగులకే అవుట్ అయినా… కెప్టెన్ రోహిత్ శర్మ కాసేపు దూకుడుగా ఆడి 48(55 బంతుల్లో ) పరుగులు చేసి జట్టు స్కోరు 83 వద్ద ఉండగా అవుట్ అయ్యాడు.
ఒత్తిడిలో పడినా కానీ…
దీంతో టీం ఇండియా ఒత్తిడిలో పడింది. మహేంద్రసింగ్ ధోని (67 బంతుల్లో 36,) దినేశ్ కార్తీక్ (61 బంతుల్లో 37)ల కీలక భాగస్వామ్యంతో కాస్తంత తేరుకుంది. కానీ.. జట్టు స్కోరు 137 దగ్గర ఉండగా కార్తీక్, 160 దగ్గర ఉండగా ధోనీ అవుట్ కావడంతో మళ్లీ టీం ఇండియాపై ఒత్తిడి పెరిగింది. అయితే… భారత్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చివర్లో చాలా బాధ్యతాయుతంగా ఆడారు.
పరుగులు – బంతుల మధ్య అంతరం తరిగిపోతున్నాకేదార్ జాదవ్ (27 బంతుల్లో 23 నాటౌట్), రవీంద్ర జడేజా (33 బంతుల్లో 23), భువనేశ్వర్ కుమార్ ( 31 బంతుల్లో21), కుల్దీప్ యాదవ్ (5 బంతుల్లో5 నాటౌట్) సహనంతో బ్యాటింగ్ చేసి భారత్ని విజయతీరాలకి చేర్చారు. ముఖ్యంగా.. ఆఖరి ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సినప్పుడు జాదవ్- కుల్దీప్లు.. ఒత్తిడికి గురవకుండా వరుసగా 1, 1, 2, 0, 1, 1 (ఒక లెగ్ బై)తో భారత్ని విజయ సంబరాల్లో ముంచెత్తారు.
ఫలితంగా భారత్ 50 ఓవర్లలో 223/7 పరుగులతో ఆసియా కప్లో ఏడోసారి విజయదుందుభి మోగించింది.