వాషింగ్టన్: ఈ ఏడాది మెడిసిన్ విభాగంలో హోంజో, జేమ్స్ అల్లిసన్లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి వచ్చింది. కేన్సర్ చికిత్సలో చెక్ పాయింట్ థెరపీని కనుగొన్నందున నోబెల్ అసెంబ్లీ ఆఫ్ ది కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరికి పది లక్షల డాలర్ల నగదు బహుమతిని అందజేయనున్నారు.
జపాన్ దేశానికి చెందిన ‘తసుకు హోంజో’ కేన్సర్ ఇమ్యునోథెరపీపై పరిశోధనలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన ‘జేమ్స్ అల్లిసన్’ ఎం.డి. అండర్సన్ కేన్సర్ సెంటర్లో ఇమ్యునాలజీ విభాగాధిపతిగా, ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఇమ్యునోథెరపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్సారు.
1901 నుంచి ఇలా…
ఏటా మెడిసిన్ విభాగంలో తొలి నోబెల్ ప్రైజ్ను ప్రకటిస్తారు. డైనమెట్కు రూపకల్పన చేసిన ‘అల్ఫ్రడ్ నోబెల్’ పేరిట 1901 నుంచి ఈ నోబెల్ పురస్కారాన్ని ఇస్తు వస్తున్నారు. మంగళవారం ఫిజిక్స్లోనూ… బుధవారం కెమిస్ట్రీలోనూ… నోబెల్ బహుమతులను ప్రకటించనున్నారు. అలాగే ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్నికూడా మంగళవారం స్విడన్లో ప్రకటించనున్నారు. శుక్రవారం నాడు ‘నోబెల్ శాంతి’ బహుమతి ప్రకటిస్తారు.
ఈ ఏడాది ‘సాహిత్యం’లో లేనట్లే…
ఈ ఏడాదికిగాను సాహిత్య విభాగంలో నోబెల్ని ఎవరికి ఇవ్వకుండా వాయిదా వేశారు. అవార్డింగ్ బాడీ లైంగిక ఆరోపణల్లో చిక్కుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ‘మీ టూ’ ప్రకంపనల నేపథ్యంలో ఈ ఏడాది సాహిత్య నోబెల్ పురస్కారాన్ని స్వీడిష్ అకాడెమీ వాయిదా వేసింది. అకాడెమీలోని శాశ్వత సభ్యరాలు, కవయిత్రి అయిన కటరినా ఫ్రోస్టెన్సన్. ఆమె తన భర్త ఫ్రెంచి జాతీయుడైన జీన్ క్లౌడ్ అర్నాల్డ్తో కలిసి ఒక సాహితీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు స్వీడిష్ అకాడెమీ ఎక్కువ మొత్తంలో నిధులను అందజేస్తోంది.
అయితే ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా పలువురు మహిళలు జీన్ క్లౌడ్ అర్నాల్డ్ తమపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. దీంతోపాటు అకాడెమీ ఆస్తులను సైతం అర్నాల్డ్ దుర్వినియెగం చేశాడనీ, అలాగే సాహితీ పురస్కారంపై లీకులిచ్చాడని ఆరోపణలు ఎక్కువయ్యాయి.. ఈ వివాదాల కారణంగా 18 మంది శాశ్వత సభ్యులుండే స్వీడిష్ అకాడెమీలో కలహాలు మొదలయ్యాయి.