ముంబై: సరికొత్తగా ముస్తాబై మార్కెట్లో రీలాంచ్ అయిన హ్యుందాయ్ శాంత్రో 2018 అమ్మకాలలో దూసుకుపోతోంది. కస్టమర్ల విశేష ఆదరణతో తన ప్రాభవాన్ని మరోసారి చాటుకుంటోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 12 రోజుల్లో ఏకంగా 23,500 బుకింగ్లను నమోదు చేసుకుంది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత చిన్న కార్ల సెగ్మెంట్లో తొలిసారిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కారుగా శాంత్రో ఎహెచ్-2 ను లాంచ్ చేసింది.
హ్యుందాయ్ కొత్త శాంత్రో ఒక గ్లోబల్ ప్రొడక్ట్ అని స్పష్టం చేసిన కంపెనీ.. దేశీయంగా డిమాండ్ లక్ష్యాన్ని ఛేదించిన అనంతరం ఇతర మార్కెట్లకు కూడా విస్తరిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ కొత్త ఆల్ న్యూ శాంత్రో ప్రారంభ ధర రూ.3.89 లక్షలు. ఈ కారు ఐదు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్స్లో లభ్యమవుతోంది. స్పోర్ట్స్, మ్యాగ్నా, డ్లైట్ , ఎరా, ఆస్టా పేర్లతో లభ్యమవుతోంది. స్పోర్ట్స్, మ్యాగ్నాలో సీఎన్జీ వెర్షన్ కూడా ఉంది.
శాంత్రో కారుకు ప్రీ బుకింగ్లు అక్టోబర్ 10, 2018న ప్రారంభం కాగా ఇప్పటికే 23,500 బుకింగ్లు వచ్చాయని హ్యుందాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్ల ఆదరణను తాము తిరిగి సంపాదించడం సంతోషంగా ఉందని హ్యుందాయ్ ఇండియా ఎండీ తెలియజేశారు. భారీ సంఖ్యలో బుకింగ్లతో మూడు నెలలకు సరిపడా ఉత్పత్తి వాల్యూమ్ను పొందామంటూ వినియోగదారులకు హ్యుందాయ్ శాంత్రో తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కారుకు సంబంధించిన ప్రీ-బుకింగులు నిన్నటితో నిలిచిపోయాయి.