
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని సంత్కబీర్నగర్లో ఒకే కుటుంబంలో 18 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని శనివారం ఆ జిల్లా కలెక్టర్ రవీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
అసలేం జరిగిందంటే.. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి గత నెలలో సంత్కబీర్నగర్లోని తన ఇంటికి వచ్చాడు.
చదవండి: విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్కు జరపండి: యూజీసీకి కమిటీ నివేదిక సిఫార్సు…
అతడిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో కొద్దిరోజుల క్రితం ఆ విద్యార్థికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రిపోర్టు రావడంతో అధికారులు వెంటనే అతడితోపాటు కుటుంబ సభ్యులు, బంధువలను కూడా గుర్తించి క్వారంటైన్కు తరలించారు.
వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 18 మందికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడైంది. ప్రస్తుతం వారందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు బఖిరా పోలీస్స్టేషన్ పరిధిలోని టిలాతి గ్రామంలోనూ ఓ కరోనా కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ముంబై నుంచి వచ్చిన ఆ వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు వివరించారు.
చదవండి: ‘జూమ్’ వేదికగా ఒక్కటైన జంట.. ఆన్లైన్లో అంగరంగ వైభవంగా పెళ్లి!
దీంతో అతడి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్కు తరలించి, వారి నమూనాలు పరీక్షకు పంపించారు.
శనివారం జిల్లాలో మరో 19 కొత్త కేసులు నమోదయ్యాయని, దీంతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరిందని, దీంతో ఆ రెండు ప్రాంతాలను కంటైన్మెంట్ చేశామని కలెక్టర్ రవీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.








