విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలోజరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు విశాఖ కోర్టు విధించిన రిమాండ్ను పొడిగించింది. అతడికి నవంబర్ 23 వరకు పోలీసు కస్టడీ విధించింది.
శ్రీనివాసరావుకు గతంలో విధించిన పోలీసు కస్టడీ ముగియడంతో అతడిని శుక్రవారం పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆరు రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు విచారించారు.
దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్ సమీప బంధువు విజయదుర్గతో పాటు విశాఖ ఎయిర్పోర్ట్లో అతడితో కలిసి పని చేసిన వారిని కూడా పోలీసులు ప్రశ్నించారు. అంతేకాకుండా ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్దన్ ప్రసాద్ చౌదరిని కూడా విచారించారు.
అయితే విచారణ మొత్తం నిందితుడు శ్రీనివాసరావు వరకే పరిమితం చేయడం పట్ల అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలో సూత్రధారులను కాపాడేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.