తూర్పుగోదావరి: యశ్వంత్పూర్-టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలులో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
రైలు మధ్యలో ఉన్న వంట చేసే బోగీ(ప్యాంట్రీ) నుంచి ఒక్కసారిగా మంటలు రావటంతో పక్కబోగీలో ఉన్న ప్రయాణికులు చైన్ లాగి రైల్ను నిలిపివేశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
ప్రయాణికులకు తప్పిన ముప్పు
అప్రమత్తమైన రైల్వే అధికారులు రెండు బోగీలను తప్పించారు. ఈ ప్రమాదంలో వంట చేసే బోగీ పూర్తిగా కాలిపోయింది. దీని పక్కన ఉన్న బోగీ కూడా పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. రైలు ప్రమాదం కారణంగా ఒకే లైన్ ద్వారా అధికారులు రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు. మరికొన్ని రైళ్లను నిలిపేయడంతో పలు రైళ్లు ఆలస్యంగా బయల్దేరుతున్నాయి. కాగా, ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రం చేరేందుకు సరైన మార్గం లేకపోవటంతో మంటలు ఆర్పేందుకు ఆలస్యమైంది.








