కడప: వైయస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బుధవారం జిల్లా జడ్పీ కార్యాలయం ఆవరణలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన చేస్తున్న దీక్షకు ‘ఉక్కు దీక్ష’ అని పేరు పెట్టారు. బుధవారం సీఎం రమేష్ తన స్వగ్రామమైన పొట్లదుర్తి నుంచి దాదాపు 100 కార్ల కాన్వాయ్తో బయలుదేరి, తెలుగుదేశం కార్యకర్తల నినాదాల మధ్య దీక్ష స్థలికి చేరుకున్నారు.
కడపకు చేరుకున్న అనంతరం అక్కడ గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు సీఎం రమేష్ పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఆమరణ దీక్షకు దిగారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరికి సంఘీభావం తెలిపారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో సీఎం రమేష్ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదికను కూడా పరిశీలించాలని ఆయన కోరారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని సీఎం రమేష్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా…
ఈ నేపథ్యంలోనే బుధవారం సీఎం రమేష్ తన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఎంపీ సీఎం రమేష్తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఆమరణదీక్షకు దిగారు. వారికి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. అయితే, సీఎం రమేష్ కంటే ఒక్కరోజు ముందుగానే అంటే మంగళవారమే ఇదే డిమాండ్తో వైఎస్సార్సీపీ ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కూడా 48 గంటల దీక్ష చేపట్టడం గమనార్హం.