న్యూఢిల్లీ : పనామా పేపర్ల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లా కంపెనీ మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన మరికొన్ని పరిశోధనాత్మక పత్రాలు బయటికి వచ్చాయి. ఈ కొత్త పత్రాల్లో భారత్కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. అయితే వీరి పేర్లు 2016 నాటి లీక్స్లో లేవు.
దాదాపు 12 లక్షలకు పైగా సరికొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) అధ్యయనం చేసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బయటపెట్టిన పత్రాలన్నింటిని దక్షిణ జర్మనీ వార్తాపత్రిక సేకరించింది. వీటిలో దాదాపు 12 వేల పత్రాలు భారతీయులకు సంబంధించినవి కావడం గమనార్హం.
2016లో బయటికొచ్చిన మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన పత్రాలలో దాదాపు 500 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. వీటిపై విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎమ్ఏజీ)ను కూడా ఏర్పాటు చేసింది. 2016నాటి లీక్ల ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎమ్ఏజీ గుర్తించింది.
కొత్త లీక్లో ఉన్న విషయాలేంటి..?
కొత్త పత్రాల్లో భారత్కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. వీరి పేర్లు 2016నాటి లీక్స్లో లేవు. తాజాగా బయటపడిన పత్రాల్లో పీవీఆర్ సినిమా యజమాని అజయ్ బిజ్లీ, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. అలాగే సునీల్ మిట్టల్ కుమారుడు, హైక్ మెసేంజర్ సీఈవో, భారతీ ఎయిర్టెల్ సీఈవో అయిన కవిన్ భారతి మిట్టల్ పేరు కూడా ఉంది. ఇంకా ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ అశ్విన్ దాని కుమారుడు జలాజ్ అశ్విన్ దాని పేరు కూడా తాజా పత్రాల్లో కనిపిస్తోంది.
వీరికీ లింక్లు ఉన్నాయట..
పనామా పేపర్లలో తమ పేర్లు రావడాన్ని గతంలో కొందరు ప్రముఖులు ఖండించిన సంగతి తెలిసిందే. అయితే తాజా లీక్స్లో వారి పేర్లు మళ్లీ బయటకు వచ్చాయి. వీరికి ఆఫ్ షోర్ కంపెనీలతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలను ఐసీఐజే జర్నలిస్టులు సంపాదించారు. ఆ ప్రముఖుల పేర్లు.. శివ్ విక్రమ్ ఖేమ్కా, నటుడు అమితాబ్ బచ్చన్, మాజీ సొలిసిటర్ జనరల్ తనయుడు జహంగీర్ సోరబ్జీ, డీఎల్ఎఫ్ గ్రూప్కు చెందిన కేపీ సింగ్, ఆయన కుటుంబం, అనురాగ్ కేజ్రీవాల్, మెహ్రాసన్స్ జ్యువెల్లర్స్కు చెందిన నవీన్ మెహ్రా, అండర్ వరల్డ్ డాన్ ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్.