అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి(మే 28)ని పురస్కరించుకుని….తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మూడు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మే27 నుంచి మే 29 వరకు మహానాడు ఘనంగా జరుగుతూ ఉంటుంది.
అయితే ఈ సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ వాయిదా వేసింది. మే23న ఫలితాలు వెలువడటం వలన మహానాడుకి కుదరదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమై చర్చించారు.
చదవండి: నిజమేనా?: ఉత్తమ్ పదవి ఊడిపోనుందా!? టీ-కాంగ్రెస్ వర్గాలలో జోరుగా చర్చ…
ఎన్నికల ఫలితాల విడుదలకు, మహానాడు మధ్య సమయం పెద్దగా లేకపోవడం వలన మహానాడు వాయిదా వేస్తున్నట్లు నేతలతో సీఎం చెప్పారు. పైగా ఫలితాల విడుదల తర్వాత కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉండడంతో మహానాడును ఈసారికి వాయిదా వేయాలని నిర్ణయించారు.
ఇక దీనికి బదులుగా ప్రతి వూరిలోనూ ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి మహానాడు నిర్వహించాలంటే కనీసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టాలి. కానీ ఈసారి ఎన్నికలు రావడం, ఫలితాలు మే23న వెలువడటం వలన మహానాడు నిర్వహణ కుదరడం లేదు. కాగా, ఎన్నికల కారణాలతో 1985,1991, 1996ల్లోనూ మహానాడు నిర్వహించలేదు.








