అమరావతి: టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చింతమనేని అనుచరులు పెదవేగి మాజీ సర్పంచ్, టీడీపీ నేత సాంబశివ కృష్ణారావుపై దాడి చేయడాన్నిఆయన తప్పుబడుతూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే…
వంగూరు-లక్ష్మీపురం మధ్య కొందరు పోలవరం కుడికాలువ గట్టు మట్టిని నిన్న అక్రమంగా తవ్వడాన్ని గమనించిన సాంబశివ కృష్ణారావు ఏఈకి సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకునేలోపే చింతమనేని ప్రభాకర్ అనుచరుడు గద్దె కిశోర్ సహా మరికొందరు సాంబశివ కృష్ణారావును కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన్ని కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఈ వ్యవహారంపై సాంబశివ కృష్ణారావు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ వ్యవహారశైలిపై పలువురు టీడీపీ నేతలు తన వద్ద ప్రస్తావించడంతో సీఎం చంద్రబాబునాయుడు ఈ మేరకు స్పందించారు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా చింతమనేని ప్రభాకర్ తీరు మారడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
పద్ధతిగా ఉంటేనే భవిష్యత్…
టీడీపీకి చెడ్డపేరు తెచ్చేలా చింతమనేని వ్యవహరిస్తున్నారని, ఒక్కరు చేసే తప్పుతో పార్టీ మొత్తం తలదించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో, పార్టీలో కేవలం పనిచేస్తే సరిపోదనీ, పద్ధతిగా ఉంటేనే భవిష్యత్ ఉంటుందని, తన సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించబోనని చంద్రబాబు హెచ్చరించారు.