హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. రాయలసీమకు చెందిన కొంతమంది యువ నాయకులు హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఇటీవల మీడియా సమావేశం కూడా నిర్వహించారు.
రాయలసీమ అంటే రక్త పాతం, హింస అన్న మాదిరిగా ..సీమను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయంటూ ఆ డైలాగులను, సన్నివేశాలు వెంటనే సినిమా నుంచి తొలగించాలని రాయలసీమకు చెందిన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే అనూహ్యగా ఆ సంఘం యువకులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
చర్చలో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తూ….
‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై ఓ టీవీ ఛానెల్లో నిర్వహించే చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి కర్నూలు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రాయలసీమ యూత్ ఫ్రంట్ అధ్యక్షుడు జలం శ్రీను (32) మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో ఆర్వీపీఎస్ నాయకులు రవికుమార్, సీమ క్రిష్ణ, రాయలసీమ విమోచనా సమితి నాయకుడు రాజా ఉన్నారు. గాయపడిన ముగ్గురికీ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మంగళవారం సాయంత్రం వీరంతా ‘అరవింద సమేత’ సినిమాపై టీవీ ఛానెల్ నిర్వహించే డిబేట్లో పాల్గొనాల్సి ఉంది. దీనికోసం రాజాకు చెందిన బొలేరో వాహనంలో వీరంతా కర్నూలు నుంచి మంగళవారం ఉదయం బయలుదేరారు. అడ్డాకుల టోల్ప్లాజా వద్దుకు రాగానే వీరి వాహనం ఘోర ప్రమాదానికి గురైంది.
ప్రమాదంలో జలం శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారు నుజ్జునుజ్జు అయింది. జలం శ్రీను హఠాన్మరణంతో రాయలసీమ యువత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మిగిలిన ముగ్గురు యువకుల వైద్య ఖర్చుల కోసం రాయలసీమ యువ నేతలు విరాళాలు సేకరిస్తున్నారు. కాగా, ప్రస్తుతం జలం శ్రీను భార్య గర్భిణి. అతనికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.